కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో బీజేపీ కార్పొరేటర్లు అవినీతికి పాల్పడొద్దని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సున్నితంగా హెచ్చరించారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించి కరీంనగర్ కార్పొరేషన్ను బీజేపీకి అప్పగించారని, వారి ఆకాంక్షలకు అనుగుణంగా అవినీతికి తావులేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం… కేంద్రం నుంచి పెద్ద ఎత్తున నిధులు తీసుకొస్తున్నామని వివరించారు. మంగళవారం సాయంత్రం కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావుతోపాటు బీజేపీ కార్పొరేటర్లతో బండి సంజయ్ అరగంట పాటు సమావేశమయ్యారు.
అలా చేస్తే మరో పదేళ్లు బీజేపీదే అధికారం..
ఈ సందర్భంగా కార్పొరేటర్లను ఉద్దేశించి బండి సంజయ్ మాట్లాడుతూ.. కరీంనగర్ ప్రజలు మనపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వివరించారు. అవినీతికి పాల్పడితే మాత్రం సహించే ప్రసక్తే లేదన్నారు. మీ పనితీరుతో బీజేపీకి మంచి పేరు తీసుకురావాలన్నారు. యూసీఎఫ్ స్కీంలో కరీంనగర్కు రూ.840 కోట్లు మంజూయ్యాయని.. అవినీతి లేకుండా పనులు చేపట్టి పార్టీకి, తనకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్పొరేషన్లో కొందరు అధికారులు మాట వినడం లేదని, అవినీతికి పాల్పడుతున్నారని కార్పొరేటర్లు కేంద్ర మంత్రికి తెలిపారు. అలాంటి వారిపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమన్నారు. అవినీతి లేకుండా పని చేస్తే మరో పదేళ్లు కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ అధికారంలో ఉంటుందని చెప్పారు.

