కలం, వెబ్ డెస్క్ : తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల రక్షణ కోసం అటవీ సిబ్బంది చేస్తున్న కృషిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొనియాడారు. అడవుల్లో వేటగాళ్లు ఏర్పాటు చేసిన 250పైగా ఉచ్చులు, కరెంట్ తీగలను తొలగించిన అటవీ సిబ్బందిపై ప్రశంసలు కురిపించారు. అడవుల్లో అక్రమ వేటను అరికట్టేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహిస్తూ వేటగాళ్లకు చెక్ పెడుతున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యుత్ తీగలతో అడవి జంతువులను వేటాడే ప్రయత్నాలను అడ్డుకోవడం ద్వారా అనేక వన్యప్రాణుల ప్రాణాలను కాపాడగలిగారని చెప్పారు.
ఈ సందర్భంగా వన్యప్రాణుల రక్షణకు గిరిజనులు కూడా సహకరించాలని పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. అడవులు, వన్యప్రాణులు మన సంపద అని, వాటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అటవీ సంపదకు హానీ చేసే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు అక్రమ వేట, అడవి నరికివేత, వన్యప్రాణులపై దాడులు వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని వార్నింగ్ ఇచ్చారు.

