కలం, వెబ్ డెస్క్: ఆంధ్రా పేపర్స్ మిల్లు యాజమాన్యంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజమండ్రి నగర కాలుష్యానికి ఈ పరిశ్రమనే కారణమవుతోందన్నారు. 2016 తరువాత ప్రభుత్వానికి పరిశ్రమ ఒక్క రూపాయి పన్ను కూడా కట్టలేదని, ఇప్పటివరకు రూ.21.34 కోట్లు బకాయిలు పడ్డారని స్పష్టం చేశారు. వెంటనే ఆ పరిశ్రమపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం కేరళ పర్యటనలో ఉన్న పవన్ కల్యాణ్ అక్కడి నుంచి అధికారులతో ఈ పరిశ్రమ గురించి ఆరా తీసి, చర్యలు తీసుకోవాలని సూచించారు.
గతంలోనే హెచ్చరించినా..
ఆంధ్ర పేపర్స్ మిల్లు యాజమాన్యంపై జూన్ నెలలోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష చేశారు. మిల్లు కారణంగా పరిసర ప్రాంతాల్లో కాలుష్యం అధికంగా ఉందని, గోదావరిలో వ్యర్థాలు భారీ స్థాయిలో కలుస్తున్నాయని తెలిపారు. తక్షణమే పరిశ్రమను మూసివేసేందుకు అన్ని రకాల అర్హతలున్నాయని, కానీ కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని తప్పులు సరిదిద్దుకునేందుకు మరో అవకాశం ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. సీవరేజ్ ట్రీట్ ప్లాంట్ పనితీరుని వెంటనే మెరుగుపర్చుకోవాలని ఆదేశించారు. రెండు నెలలు గడిచినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేనట్లు గుర్తించిన పవన్ కల్యాణ్.. ఇక కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

