కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరికొత్త హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు బటర్ఫ్లై పార్క్ను సందర్శించిన ఆయన, అక్కడ మొక్కలు నాటే కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని చాటిచెబుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న ఒక బృహత్తర కార్యక్రమానికి ఆయన అంకురార్పణ చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన తల్లి అంజనా దేవి జ్ఞాపకార్థం ‘తెల్ల పొణికి’ మొక్కను నాటారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ తల్లిపై ఉన్న ప్రేమను పర్యావరణం వైపు మళ్లించాలని, ‘అమ్మ పేరుతో మొక్క’ నాటి దాన్ని సంరక్షించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నిర్ణయం పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

