కలం, వెబ్ డెస్క్ : పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల పదో తరగతి ఫలితాలు వెలువడిన వేళ తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఇప్పటికే తల్లిదండ్రులు లేని భగవంతుని పిల్లలకు నెలనెలా తన జీతాన్ని రూ. 5,000 చొప్పున నెలవారీ సాయం కింద అందిస్తున్న పవన్ కళ్యాణ్.. తాజాగా 10వ తరగతిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు వారి అభిరుచికి అనుగుణంగా ఉచితంగా ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు చొరవ చూపారు.
వివరాల్లోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ నుంచి రూ.5000 సాయం అందుకుంటున్న వారిలో ఏడుగురు విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించారు. వీరితోపాటు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 31 మంది 580 మార్కును దాటారు. ఈ విద్యార్థులలో 598 మార్కులు సాధించి, రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన ఒక విద్యార్థి కూడా ఉన్నారు. వీరందరి ప్రతిభకు తనవంతు ప్రోత్సాహకంగా పై చదువులకు సాయం చేయాలని నిర్ణయించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఆయా విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, వారి ఆసక్తికి అనుగుణంగా కోర్సులు, కళాశాలలు ఎంపిక చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఆయా కళాశాలల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి ఆ 31 మందికి ఉచిత విద్య ఏర్పాటు చేశారు. తన నిర్ణయాన్ని గౌరవించి, అడిగిన వెంటనే పిఠాపురం విద్యార్ధులకు అడ్మిషన్లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విద్యాసంస్థలకు పవన్ కళ్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులకు శుభాశీస్సులు అందిస్తూ.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమంగా రాణించాలని సూచించారు.

