కలం, వెబ్ డెస్క్: రోమ్లో జరుగుతున్న ఇటాలియన్ ఓపెన్లో వరల్డ్ నంబర్వన్ జానిక్ సిన్నర్ (Jannik Sinner) దూసుకెళ్తున్నారు. మంగళవారం జరిగిన ప్రిక్వార్టర్స్లో తన దేశస్థుడు ఆండ్రియా పెల్లెగ్రినోపై 6-2, 6-3 తేడాతో సునాయాస విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్లోకి అడుగుపెట్టారు. ఈ విజయంతో మాస్టర్స్ 1000 టోర్నీల్లో వరుసగా 31 విజయాలు సాధించిన నోవాక్ జోకోవిచ్ రికార్డును సిన్నర్ సమం చేశారు. మ్యాచ్ తర్వాత సిన్నర్ తన ఆటపై సంతోషం వ్యక్తం చేస్తూ, పెల్లెగ్రినో పోరాటాన్ని అభినందించారు. క్వార్టర్ ఫైనల్స్కు ముందు దొరికిన విరామం ఉపయోగపడుతుందని చెప్పారు. మరోవైపు, వేలాది మంది అభిమానుల మధ్య సిన్నర్తో ఆడటం తన కెరీర్లో ప్రత్యేక క్షణమని పెల్లెగ్రినో తెలిపారు.
ఇక మరో మ్యాచ్లో భారీ సంచలనం నమోదైంది. 18వ సీడ్ లూసియానో దార్డేరి.. మాజీ ఛాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్ను 1-6, 7-6, 6-0తో ఓడించాడు. తొలి సెట్ కోల్పోయిన దార్డేరి అద్భుతంగా పుంజుకుని మ్యాచ్ను తిప్పికొట్టాడు. తన కెరీర్లో తొలిసారి టాప్-10 ప్లేయర్ను ఓడించడం ఆనందంగా ఉందని, రోమ్లో ఈ విజయం జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పాడు. కార్లోస్ అల్కరాజ్ గాయంతో దూరం కావడం, జ్వెరెవ్ నిష్క్రమణతో ఇప్పుడు సిన్నర్ టైటిల్ ఫేవరెట్గా మారాడు. క్వార్టర్ ఫైనల్లో ఆయన ఆండ్రీ రుబ్లెవ్తో తలపడనున్నారు.

