కలం, వెబ్ డెస్క్ : ఏలూరు (Eluru) జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆధ్యాత్మిక బోధనలు చేయాల్సిన ఒక చర్చి పాస్టర్ ఓ మైనర్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. కామవరపుకోట మండలం కళ్లచెరువు గ్రామంలో ఈ ఘటన జరిగింది. పాస్టర్ చేసిన క్రూరమైన చర్యల వల్ల బాలికకు తీవ్ర రక్త స్రావం అయ్యి ఆసుపత్రిలో చేరడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనం ప్రకారం.. కామవరపుకోట మండలానికి చెందిన చౌటపల్లి రాంబాబు (42) అనే వ్యక్తి స్థానికంగా చర్చి ఏర్పాటు చేసుకుని ప్రార్థనలు నిర్వహిస్తుండేవాడు. కూలి పనులు చేసుకుంటూ తన వద్దకు తరచూ వస్తున్న ఓ నిరుపేద కుటుంబపు 14 ఏళ్ల బాలికపై కన్నేసిన ఈ పాస్టర్, ఆమెను బెదిరించి పలుమార్లు అత్యాచారానికి తెగబడ్డాడు. బాలికను బెదిరించడంతో ఆమె ఎవరికీ చెప్పలేదు. అయితే ఇటీవల బాలిక గర్భం దాల్చింది. ఈ విషయాన్ని తెలుసుకున్న పాస్టర్ రాంబాబు, ఆమెకు అధిక మోతాదులో గర్భనిరోధక మాత్రలు మింగించాడు.
పాస్టర్ రాంబాబు చేసిన పాశవిక చర్య వలన బాలికకు తీవ్ర రక్తస్రావం జరిగింది. ప్రాణభయంతో బాధితురాలు జరిగిన విషయాన్ని తన తల్లికి వివరించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి విషమంగా ఉంది. నిందితుడు రాంబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు .. అతనిపై పోక్సో (POCSO) చట్టంతో పాటు ఇతర కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ క్రూరత్వానికి పాల్పడిన నిందితుడిని ఉరి తీయాలని బాధితురాలి కుటుంబ సభ్యులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు.

