కలం, వెబ్ డెస్క్ : మీరు కొత్తగా పాన్ కార్డు (PAN Card) కోసం దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వార్త మీ కోసమే. 2026 ఏప్రిల్ 1వ తేదీ నుండి పాన్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువస్తోంది. ఐటీ శాఖ నిబంధనల ప్రకారం, ఇకపై కేవలం ఆధార్ కార్డు ఉంటే పాన్ కార్డు రాదు. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం.. ఆధార్ కార్డు ఒక్కటి ఉంటే గుర్తింపు, అడ్రెస్, డేట్ ఆఫ్ బర్త్ ధృవీకరణగా సరిపోతుంది. కానీ, 2026 మార్చి 31తో ఈ విధానం ముగియనుంది. ఏప్రిల్ 1 నుండి దరఖాస్తుదారులు ఆధార్తో పాటు అదనపు పత్రాలను సమర్పించడం తప్పనిసరి. ఇందులో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడీ, పదవ తరగతి సర్టిఫికేట్, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలలో ఏదైనా ఒకటి జత చేయాల్సి ఉంటుంది.
మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే, మీ ఆధార్ కార్డులో పేరు ఎలా ఉంటే పాన్ కార్డు (PAN Card)పై కూడా అలాగే ముద్రించబడుతుంది. ఆధార్లోని పేరులో తప్పులు ఉంటే పాన్ కార్డు దరఖాస్తులో ఇబ్బందులు ఎదురవుతాయని అధికారులు స్పష్టం చేశారు. అందుకే దరఖాస్తు చేసుకునే ముందే ఆధార్లోని వివరాలను సరిచూసుకోవడం మంచిది. అలాగే, ఏప్రిల్ 1 నుండి పాత దరఖాస్తు ఫారమ్లు చెల్లవు. ఆదాయపు పన్ను శాఖ విడుదల చేసే కొత్త ఫారమ్లను మాత్రమే వాడాల్సి ఉంటుంది.
ఈ మార్పులతో పాటు ఆర్థిక లావాదేవీల పరిమితుల్లో కూడా మార్పులు రానున్నాయి. కొత్త ముసాయిదా నిబంధనల ప్రకారం.. ఆస్తి కొనుగోలు వ్యవహారాల్లో రూ.20 లక్షలు దాటితేనే పాన్ కార్డు వివరాలు అవసరమవుతాయి. వాహనాల కొనుగోలుకు రూ.5 లక్షలు, హోటల్ బిల్లులకు రూ.1 లక్ష దాటితే పాన్ తప్పనిసరి కానుంది. ఈ కొత్త నిబంధనలకు అనుగుణంగా పౌరులు తమ పత్రాలను సిద్ధం చేసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా చూసుకోవచ్చు.
Read Also: కేరళ ఎన్నికల ప్రచారానికి సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram

