కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేరళ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన కేరళకు వెళ్లనున్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున కీలక ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో కీలక నాయకుడిగా ఎదుగుతున్న రేవంత్ రెడ్డి… ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో కూడా స్టార్ క్యాంపెయినర్గా వ్యవహరిస్తున్నారు. కేరళలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ఆయన ప్రచారంలో పాల్గొనడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కేరళలో హై వోల్టేజ్ ఎన్నికలు
కేరళలో 2026 అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. మొత్తం 140 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా రెండు కూటముల మధ్య పోరు కొనసాగుతోంది. ఎల్డీఎఫ్ (వామపక్ష కూటమి), యూడీఎఫ్ (కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి) మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. భారతీయ జనతాపార్టీ కూడా ఈ రాష్ట్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ప్రస్తుతం ఎల్డీఎఫ్ ప్రభుత్వం అధికారంలో ఉండగా… వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని లక్ష్యంగా పెట్టుకుంది. యూడీఎఫ్ దాదాపు పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.

