కలం, మహబూబ్నగర్ బ్యూరో: ఎన్నికల నినాదంగా మారిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు (Palamuru Rangareddy Project) పనులు చివరి దశకు చేరుకున్నాయి. మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 12.30 లక్షల ఎకరాలకు సాగునీటితో పాటు, తాగునీరును అందించడానికి రూపొందించిన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పూర్తికి తెలంగాణ ప్రభుత్వం సంకల్పించింది. ప్రాజెక్టు పూర్తికి అడ్డంకిగా మారిన భూ సేకరణ పనులు నిధులు లేక నిలిచిపోయాయి. దీంతో గత కొంతకాలంగా పనులు జరగడం లేదు. ఈ విషయమై రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ సమక్షంలో ప్రాజెక్టుపై సమీక్షలు సైతం జరిగాయి. ఈ క్రమంలోనే ఇటీవల అధికార, ప్రతిపక్ష పార్టీలు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పూర్తి కోసం పోటీపడ్డారు. ప్రాజెక్టు పనుల కోసం వచ్చే జూన్లో నార్లాపూర్ నుండి ఉదండాపూర్ రిజర్వాయర్ (Udandapur Reservoir) వరకు పాదయాత్ర చేస్తామంటూ బీఆర్ఎస్ నేతలు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు (Palamuru Rangareddy Project) పనులు పూర్తి కావడానికి ఆలస్యం అయ్యాయని అధికార పార్టీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఇదే విషయమై ఇటీవల జిల్లా మంత్రులు వాకిటి శ్రీహరి , జూపల్లి కృష్ణారావుతో కలిసి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అధికార పార్టీ ఎమ్మెల్యేలంతా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జిల్లా పరిస్థితులు వివరించారు. దీంతో ప్రతిపక్ష పార్టీకి అవకాశం ఇవ్వకూడదని లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే శనివారం హైదరాబాద్లో సమావేశమైన మంత్రి మండలి, ప్రాజెక్టు పనుల భూసేకరణ, పునరావాసానికి సంబంధించి రూ.587.27 కోట్లు మంజూరు చేస్తూ పరిపాలన అనుమతులకు ఆమోదముద్ర వేశారు. దీంతో ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతాయని ప్రజలు ఆశిస్తున్నారు. ఇదే నిజమైతే పాలమూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరుతుంది.
Read Also: ఘోర విషాదం.. 10 మంది దుర్మరణం!
Read Also: సర్కారు ఆసుపత్రులు అస్తవ్యస్తం

