కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ (Pakistan) ప్రస్థానం ముగిసింది. శ్రీలంకపై విజయం సాధించినప్పటికీ.. రన్ రేట్ సమీకరణాల వల్ల సెమీస్ చేరకుండానే ఆ జట్టు ఇంటిముఖం పట్టింది. ఈ పరాజయంపై కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా స్పందిస్తూ తన రిటైర్మెంట్, కెప్టెన్సీపై కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం శ్రీలంకతో జరిగిన చివరి సూపర్-8 మ్యాచ్లో పాకిస్థాన్ 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే సెమీ-ఫైనల్ రేసులో నిలవాలంటే ఈ గెలుపు సరిపోదు. న్యూజిలాండ్ నెట్ రన్ రేట్ను అధిగమించాలంటే శ్రీలంకను 147 పరుగులకే కట్టడి చేయాల్సి ఉండగా.. పాక్ బౌలర్లు ఆ విషయంలో విఫలమయ్యారు. ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 212 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే శ్రీలంక పోరాడటంతో నిర్ణీత లక్ష్యాన్ని పాక్ చేరుకోలేకపోయింది. దీంతో ఇంగ్లాండ్తో పాటు న్యూజిలాండ్ సెమీస్కు దూసుకెళ్లగా, పాకిస్థాన్ టోర్నీ నుండి వైదొలిగింది.
మ్యాచ్ (Pakistan – Sri Lanka) అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్లో సల్మాన్ అలీ ఆఘా (Salman Ali Agha) జట్టు వైఫల్యాన్ని అంగీకరించారు. ఈ టోర్నీలో తాము సగటు కంటే తక్కువ స్థాయి ప్రదర్శన ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం ఆశించిన స్థాయిలో రాణించలేదని, సాహిబ్జాదా ఫర్హాన్కు ఇతర బ్యాటర్ల నుండి సరైన సహకారం అందలేదని అభిప్రాయపడ్డారు. గత కొన్నేళ్లుగా మిడిల్ ఆర్డర్ సమస్య వేధిస్తోందని, దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
కీలక సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే గత నాలుగు ఐసీసీ (ICC) టోర్నీల్లో సెమీస్ చేరలేకపోయామని సల్మాన్ విశ్లేషించారు. ఈ వైఫల్యానికి తానే కాకుండా హెడ్ కోచ్ మైక్ హెసన్ కూడా పూర్తి బాధ్యత వహిస్తారని స్పష్టం చేశారు. ఇక తన కెప్టెన్సీ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ.. ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అది భావోద్వేగంతో కూడుకున్నది అవుతుందని సల్మాన్ అన్నారు. ఇంటికి వెళ్ళాక కొన్ని రోజులు ఆలోచించి, ఆపై తుది నిర్ణయం తీసుకుంటానని ఆయన వెల్లడించారు.
Read Also: ఇరాన్పై దాడులను ఖండించిన న్యూయార్క్ మేయర్
Follow Us On: Instagram

