కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్ మావోయిస్టు ముప్పిడి సాంబయ్య (Muppidi Sambayya) అలియాస్ వికాస్ సహా మొత్తం 15 మంది చత్తీస్గడ్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వరంగల్ జిల్లా తరాలపల్లి (Tharalapally) గ్రామానికి చెందిన ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ ప్రస్తుతం ఒడిశా రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు బీబీఎం (బొలాంగీర్-బార్గఢ్-మహాసముంద్) డివిజన్ కీలక నేతగానూ ఉన్నారు. ఈయనతో పాటు పలువురు డివిజినల్ కమిటీ సభ్యులు, ఏరియా కమిటీ సభ్యులు కూడా లొంగిపోయారు. వారి వెంట తీసుకెళ్లిన ఆయుధాలను సైతం పోలీసులకు అప్పగించారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా ఉన్న ముప్పిడి సాంబయ్య గురించి తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి (DGP Shivadhar Reddy) సైతం ఇటీవల ప్రస్తావించి జన జీవన స్రవంతిలోకి రావాల్సిందిగా పిలుపునిచ్చారు. రోజుల వ్యవధిలోనే ఆయన లొంగిపోవడం గమనార్హం.
సరెండర్లో జర్నలిస్టు మీడియేషన్ :
ఆపరేషన్ కగార్ (Operation Kagar) లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మావోయిస్టు ఉద్యమాన్ని, ఆ పార్టీలోని కీలక నేతలను నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టడంతో ముప్పిడి సాంబయ్య (Muppidi Sambayya) లొంగుబాటులో స్టేట్ ఇంటెలిజెన్స్ సహకారంతో ఒక జర్నలిస్టు యాక్టివ్ రోల్ పోషించినట్లు అక్కడి మీడియాలో వార్తలు వచ్చాయి. సాంబయ్యతో పాటు డివిజనల్ కమిటీ సభ్యుడు మంగేశ్ (బేబీ), ఏరియా కమిటీ సభ్యులు రింకూ, అస్మిత, హోలిక, రీటా, నీలా, ప్లాటూన్ సభ్యులు దినేష్, కవిత, సవిత, జుగ్నూ, సుశ్మిత, అమిత, మీనా తదితరులు కూడా ఉన్నట్లు చత్తీస్గఢ్ పోలీసు వర్గాలు వెల్లడించాయి. లొంగిపోయినవారితో పాటు మూడు ఏకే-47 రైఫిళ్లు, రెండు ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, మరో రెండు ఇన్సాస్ రైఫిళ్లు, మూడు 0.303 రైఫిళ్లు, పలు రకాల మందుగుండు సామగ్రిని కూడా అప్పగించినట్లు తెలిపాయి.
Read Also: వరంగల్ డ్రీమ్ ప్రాజెక్ట్కు షార్ట్ రన్వే షాక్!
Follow Us On : WhatsApp

