కలం, వెబ్ డెస్క్: పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ముజఫరాబాద్లో పాకిస్థాన్ (Pakistan) ఆర్మీకి చెందిన ఎంఐ-17 హెలికాప్టర్ కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న 21 మంది సిబ్బంది మృతి చెందారు. పీవోకేలోని నీలం వ్యాలీకి సైనికులను తీసుకెళ్తున్న క్రమంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఎమర్జెన్సీ ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించగా.. కుప్పకూలిపోవడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లు పాక్ వైమానిక దళం ఓ ప్రకటనలో తెలిపింది.
మరింత ఉద్రిక్తంగా మారుతున్న పీవోకే..
పీవోకే పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. అవామీ యాక్షన్ కమిటీపై నిషేధానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న ప్రజలపై పాక్ సైన్యం విచక్షణరహితంగా కాల్పులు జరపడంతో 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వందల సంఖ్యలో జనాలకు బుల్లెట్ గాయాలైనట్లు వీడియోల ద్వారా స్పష్టమవుతోంది.

