కలం, వెబ్డెస్క్: అసోం (Assam) యూనిఫాం సివిల్ కోడ్ (UCC)పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin Owaisi) ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు చేశారు. అసోం యూసీసీలో అసలు ఏకరూపత లేదని, అది గిరిజన సంఘాలకు దీని నుండి పూర్తిగా మినహాయింపు ఇచ్చిందని ఆయన ఆరోపించారు. ఆర్టికల్ 29 ప్రకారం ప్రతి సమాజానికి తమ సంస్కృతిని రక్షించుకునే హక్కు ఉన్నప్పుడు, కేవలం గిరిజనుల స్వయంప్రతిపత్తిని మాత్రమే ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. ఇది ఎవరికీ ఇష్టం లేని చట్టాన్ని బలవంతంగా రుద్దడమేనని, రాజ్యాంగ పరిషత్ కూడా ఇటువంటి నిర్బంధ యూసీసీని ఊహించలేదని ఆయన పేర్కొన్నారు. ఇక ఇస్లాం ప్రకారం ఎవరూ కూడా తమ వారసులను ఆస్తి వారసత్వం నుండి మినహాయించలేరని, కుమార్తెకు వాటా ఇవ్వకుండా మొత్తం ఆస్తిని ఒకే కొడుకుకు రాసివ్వడం కుదరదని ఒవైసీ స్పష్టం చేశారు. ప్రస్తుత యూసీసీ ఎవరికైనా విల్ రాసి తమ కుమార్తెలకు దక్కాల్సిన న్యాయమైన వాటాను నిరాకరించేందుకు అనుమతిస్తోందని, కాబట్టి ఇది ఎంతమాత్రం లింగ సమానత్వం ఉన్న చట్టం కాదని తీవ్రంగా తప్పుపట్టారు.

