కలం, వెబ్ డెస్క్: నోటి క్యాన్సర్ నివారణ, ముందస్తు గుర్తింపు, పొగాకు వలన కలిగే నష్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు హైదరాబాద్ (Hyderabad) లో ‘ఓరల్ క్యాన్సర్ అవేర్నెస్ రన్’ ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramchander Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. డ్రగ్స్ను నిర్మూలించేందుకు, నషా ముక్త్ తెలంగాణ దిశగా అడుగులు వేయాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈగల్ వ్యవస్థ తీసుకొచ్చిందని అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా గంజాయి తీసుకునే వారిలో అవేర్నెస్ తీసుకురావడమే కాకుండా గంజాయి ముఠాలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
రామచందర్ రావు మాట్లాడుతూ.. మన దేశంలో క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుందని అన్నారు. దీన్ని నివారించేందుకు మన అలవాట్లను మార్చుకోవాలని, రోజువారీ ఆహారంలో మిల్లెట్స్, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత సిగరెట్లు, గుట్కా మానేయాలని సూచించారు. ఇవి మానేసినపుడే క్యాన్సర్ బారిన పడకుంటా ఉంటామని అన్నారు. దేశంలో ఆరోగ్యమైన యువత ఉన్నప్పుడే దేశం బలంగా ఉంటుందని, యువత బలహీన పడితే దేశం కూడా బలహీన పడుతుందని అన్నారు.

