కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) జిల్లా కేంద్రంలో డంప్ యార్డ్ కారణంగా ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారని వెంటనే తొలగించాలని పలు పార్టీల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజావాణి ఇన్ఛార్జి రాజ్ కుమార్కు సీపీఐ, సీపీఎం, బీఆర్ఎస్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ నేతలు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, గుడి కందుల సత్యం, జంగిలి ఐలందర్ యాదవ్, జిందం ప్రసాద్, కొక్కిరాల సత్య రావు వినతిపత్రం అందించారు. డంప్ యార్డ్ సమస్యను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని విమర్శించారు. అధికారంలోకి రాగానే డంప్ యార్డ్ సమస్య పరిష్కారిస్తామని చెప్పి ఎన్నికల్లో మాట ఇచ్చి ఇప్పుడు మాట మార్చడం సరైనది కాదన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో నిధులు కేటాయించి వృథా చేశారు తప్ప సమస్య పరిష్కరించలేదన్నారు.
త్వరలోనే భారీ ఆందోళన..
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి స్వయాన డంపు యార్డుకు వచ్చి పరిశీలించినా.. నేటికీ సమస్య ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని ఆరోపించారు. ఇకనైనా పరిష్కరించని పక్షంలో రాజకీయ పక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆరు నెలల్లో డంప్ యార్డును కరీంనగర్ నుంచి తరలిస్తామని, విలీన గ్రామాల నుంచి ట్రాక్టర్ల ద్వారా వచ్చే చెత్తను కూడా ఆ విలీన గ్రామాల్లోనే డంప్ చేస్తామని హామీ ఇచ్చారు. పలువురు నాయకులు పైడిపల్లి రాజు, న్యాలపట్ల రాజు, బీర్ల పద్మ, కొట్టే అంజలి, మామిడిపల్లి హేమంత్, పున్నం రవి, వినయ్, రోహిత్ తదితరులు పాల్గొన్నారు.

