కలం, యాదగిరిగుట్ట: యాదాద్రి భువనగిరి (Yadadri Bhuvanagiri) జిల్లా యాదగిరిగుట్టలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. దైవదర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమైన భక్తుల వాహనం యాదగిరిపల్లి (Yadagiripalli) వద్ద ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దర్శనం ముగించుకుని టాటా ఏస్ వాహనంలో తిరుగు ప్రయాణమైన బాధితుల వాహనం.. యాదగిరిపల్లి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. వేగంగా వెళ్లి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టి, రోడ్డుపై బోల్తా పడింది.
ఈ ప్రమాదంలో వాహనంలో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా.. మిగిలిన ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వారిని, స్వల్ప గాయాలైన వారిని తక్షణ చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

