Mobile Popup Ad
Mobile Popup Ad

పెట్రోల్‌లో నీళ్లు.. ఇథనాల్ ఇంధనంపై రచ్చ!

కలం, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (Ethanol Blended Petrol) అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ ఇథనాల్ బ్లెండింగ్ విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్, విమర్శలు మొదలయ్యాయి. పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో ఇంధనం కొట్టించుకుంటున్న వాహనదారులు, అక్కడ జరుగుతున్న కొన్ని పరిణామాలను చూసి తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన కొన్ని వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాహనదారులు పెట్రోల్ బంకుల్లో ప్లాస్టిక్ బాటిళ్లలో పెట్రోల్ పడుతుండగా, అందులో సగం వరకు నీరు, మిగిలిన సగం పెట్రోల్ వేర్వేరు పొరలుగా విడిపోయి కనిపిస్తోంది. ఒకే బాటిల్‌లో పెట్రోల్, నీరు స్పష్టంగా వేరు పడి ఉండటాన్ని చూపిస్తూ వాహనదారులు పెట్రోల్ బంక్ సిబ్బందిని నిలదీస్తున్నారు. ప్రభుత్వం ప్రమోట్ చేస్తున్న ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (Ethanol Blended Petrol) నాణ్యత ఇదేనా, దీనివల్ల తమ వాహనాల ఇంజిన్లు పాడైపోవా అంటూ నెటిజన్లు నితిన్ గడ్కారీని, కేంద్ర ప్రభుత్వాన్ని ట్యాగ్ చేస్తూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇథనాల్‌కు వాతావరణంలోని తేమను లేదా నీటిని ఆకర్షించే గుణం ఎక్కువగా ఉంటుంది. పెట్రోల్ బంకుల్లోని భూగర్భ ట్యాంకుల్లో కానీ, లేదా వాహనాల ఇంధన ట్యాంకుల్లో కానీ కొద్దిగా తేమ లేదా నీరు చేరినా, ఇథనాల్ ఆ నీటితో కలిసిపోతుంది. ఈ ప్రక్రియను సైన్స్ భాషలో ‘ఫేజ్ సెపరేషన్’ అంటారు. ఇలా జరిగినప్పుడు ఇథనాల్, నీరు కలిసి బరువై బాటిల్ లేదా ట్యాంక్ అడుగుభాగానికి చేరుకుంటాయి, స్వచ్ఛమైన పెట్రోల్ పైభాగానికి తేలుతుంది. వైరల్ అవుతున్న వీడియోల్లో కనిపిస్తున్న దృశ్యాలకు ఇదే ప్రధాన కారణమని తెలుస్తోంది.

ఈ సాంకేతిక లోపం వల్ల ఇంధన నాణ్యత దెబ్బతినడమే కాకుండా, వాహనాల ఇంజిన్ల పనితీరుపై తీవ్ర ప్రభావం పడుతుందని వాహనదారులు వాపోతున్నారు. ముఖ్యంగా బైకులు, కార్ల యజమానులు ఈ పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్ తగ్గిపోవడమే కాకుండా ఇంజిన్ రిపేర్లకు వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంకుల్లో నిల్వ ఉంచే ట్యాంకులను సక్రమంగా నిర్వహించకపోవడం వల్లే ఇలా జరుగుతోందని కొందరు విమర్శిస్తుండగా, అసలు ఈ బ్లెండింగ్ విధానంలోనే లోపాలు ఉన్నాయంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, వాహనదారులకు నమ్మకం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.

Read Also: అమ్మ నుంచి ఫోన్ కాల్.. ప్రెస్‌మీట్‌కు నితీశ్‌ బ్రేక్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>