కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party) భారీ నిరసన ప్రదర్శన చేపట్టింది. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలోని అవకతవకలపై ధర్నా నిర్వహించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. సీజేపీ నిరసనలో నిరుద్యోగ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేశంలో నీట్ పేపర్ లీక్ ఆరోపణలు. పెరుగుతున్న నిరుద్యోగ సంక్షోభానికి నిరసనగా ధర్నా చేపట్టారు. పోటీ పరీక్షలలో పారదర్శకతను పాటించడంలో ప్రభుత్వం విఫలమైందని యువత ఆరోపించారు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలన్నారు.
పదేపదే జరుగుతున్న పరీక్షా అవకతవకలు జరుగుతున్నాయని.. పేపర్ లీక్లు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీశాయని నిరసన గళం వినిపించారు. దేశవ్యాప్తంగా విద్యావంతులైన యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోతున్నాయని మండిపడ్డారు. పరీక్షాను నిర్వహించడంలో విఫలమైనందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను జవాబుదారీగా చేస్తూ, ఆయన తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిష్పక్షపాతమైన, పారదర్శకమైన నియామకాలు, పరీక్షల ప్రక్రియను అమలు చేయాలన్నారు. పేపర్ లీక్ కుంభకోణాలలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగాన్ని పరిష్కరించడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ధర్నా నేపథ్యంలో ఇందిరా పార్క్లో భారీగా పోలీసుల మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పహారా కాస్తున్నారు.

