కలం, నకిరేకల్ : క్వింటాకు 5 కేజీలు అదనంగా ధాన్యం కొలిచి కొనుగోలు చేయడం దేశ చరిత్రలోనే అత్యంత దారుణమని ప్రజాపోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకటస్వామి (Nune Venkatswamy) ఆరోపించారు. రైతులపై జరుగుతున్న ఈ విధమైన దోపిడీని వెంటనే అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం చిట్యాల (Chityal) మండలంలోని వెలిమినేడు, పెదకాపర్తి, ఆరెగూడెం గ్రామాలలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.
ధాన్యంలో తాలు, బర్దాన్ వెయిట్, తేమ శాతం వంటి సాకులు చూపుతూ క్వింటాకు అదనంగా 5 కేజీలు వసూలు చేయడం అత్యంత దుర్మార్గమని ఆయన (Nune Venkatswamy) విమర్శించారు. ఇది రైతుల శ్రమను దోచుకోవడమేనని మండిపడ్డారు. అలాగే పీఏసీఎస్, ఐకేపీ సిబ్బంది స్థానిక కూలీలకు పనులు ఇవ్వకుండా బీహార్ హమాలీలను తీసుకువచ్చి, వారికి భోజనం పెట్టి సగం వేతనం నొక్కేస్తున్నారని ఆరోపించారు. ధాన్యం మార్కెట్లు నల్ల మార్కెట్లుగా మారిపోయాయని, మిల్లర్లు అధికారుల అండతో రైతులను దోచుకుంటున్నారని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవస్థపై రైతులు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు అచ్చిన అంజయ్య యాదవ్, గాదే ఎల్లేష్, సప్పిడి సత్యనారాయణ, మేడి స్వామి, మంత్రి రామకృష్ణ, మహంకాళి నరేష్, సిలువేరు నరసింహ, సిలువేరు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
Read Also: అమ్రాబాద్ అడవుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
Follow Us On: Instagram

