కలం, వెబ్డెస్క్: విజయ డెయిరీ (Vijaya Dairy) చైర్మన్ పదవికి చలసాని ఆంజనేయులు (Chalasani Anjaneyulu) రాజీనామా చేయడం ఏపీలో తీవ్ర చర్చకు దారి తీసింది. చలసానిని అధికార పార్టీ బెదిరింపులకు గురి చేసిందని, ఆయనతో బలవంతంగా రాజీనామా చేయించారని, అందుకే ఆయన అనారోగ్యం పాలయ్యారని ప్రతిపక్ష నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా చలసాని ఈ ఆరోపణలపై స్పందించారు. విజయ డెయిరీ నాయకత్వాన్ని మార్చాలని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. డెయిరీని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే తనకు బాధ్యతలు అప్పగించారని తెలిపారు. సమాచారం లోపం వల్లే బయట తప్పుడు ప్రచారం జరుగుతోందని చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఆదేశాలతోనే తాను పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
గత ఏడేళ్లుగా చలసాని ఆంజనేయులు విజయ డెయిరీ (Vijaya Dairy) చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇటీవల చైర్మన్ పదవి కోసం అసలు నామినేషన్ వేయొద్దని చలసానికి పార్టీ అధిష్టానం సూచించిందని తెలుస్తోంది. అయినా ఆయన నామినేషన్ వేయడం, ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిపోయాయి. దీంతో శుక్రవారం సాయంత్రం మంత్రులు కొల్లు రవీంద్ర, పార్థసారథి చలసాని ఇంటికి వెళ్లి పదవికి రాజీనామా చేయాలని బెదిరించినట్లు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే చలసాని తనకు ఒకరోజు సమయం కావాలని కోరారని, దీనికి మంత్రులు ఒప్పుకోలేదని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. ఆ తర్వాత చలసాని అస్వస్థతకు గురై ప్రైవేటు ఆస్పత్రిలో చేరారని తెలిపారు. మంత్రి పార్థసారథి అక్కడికి కూడా వెళ్లి బెదిరింపులకు గురిచేయడంతో ఇక చేసేదేం లేక చలసాని ఆస్పత్రిలో బెడ్ పై నుంచే తన రాజీనామా సమర్పించారని ఆరోపించారు.
Also Read : మంత్రుల పర్యటనలో బాహాబాహీ: అమరావతిలో ఉద్రిక్తత!
Follow Us On : WhatsApp

