కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ (Iran) కొత్త సుప్రీం లీడర్గా మొజ్తబా ఖమేనీ(Mojtaba Khamenei) నియామకాన్ని ఉత్తర కొరియా(North Korea) అధికారికంగా సమర్థించింది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో ఇరాన్ మాజీ అధినేత అయొతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన హత్యను ఉత్తరకొరియాలోని కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ నూతన సుప్రీం లీడర్ ఎన్నికను తాము గౌరవిస్తున్నట్లు ఉత్తర కొరియా విదేశాంగ శాఖ బుధవారం ప్రకటించింది.
ఒక దేశం యొక్క ప్రాంతీయ సమగ్రతను దెబ్బతీసేలా జరిగిన ఈ దాడులను ప్రపంచం మొత్తం వ్యతిరేకించాలని పిలుపునిచ్చింది. ఈ పరిణామాల మధ్యే ఉత్తర కొరియా తన సైనిక శక్తిని ప్రదర్శించింది. అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ సమక్షంలో ‘చో హ్యోన్'(Choe Hyon) అనే కొత్త యుద్ధనౌక నుండి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణులను పరీక్షించింది. దేశ అణు నిరోధక శక్తిని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని కిమ్ స్పష్టం చేశారు. తమ నౌకాదళాన్ని అణు ఆయుధాలతో బలోపేతం చేయడం వ్యూహాత్మకమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఉత్తర కొరియా అణు కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అమెరికా ప్రయత్నిస్తుండగా.. తమ రక్షణ కోసం ఇవి తప్పనిసరని కిమ్ సర్కార్ వాదిస్తోంది. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) యంత్రాంగం ఉత్తర కొరియాతో ఉన్నతస్థాయి చర్చలకు సిద్ధమన్న సంకేతాలిస్తోంది. వాషింగ్టన్ తమను అణు దేశంగా గుర్తిస్తే కలిసి పనిచేసేందుకు సిద్ధమని కిమ్ జోంగ్ ఉన్ కూడా సూచించారు. ప్రస్తుతానికి ఇరాన్ కొత్త నాయకత్వానికి మద్దతు తెలపడం ద్వారా అంతర్జాతీయ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు కనిపిస్తున్నాయి.

