కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశవ్యాప్తంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఇదే అదనుగా తీసుకొని సైబర్ నేరగాళ్లు మోసాలకు తెరలేపుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ (Sajjanar) వినియోగదారులకు కీలక సూచనలు చేశారు. “తక్షణమే సిలిండర్ డెలివరీ” “అదనపు సిలిండర్లు ఇస్తాము” అని ఆకర్షణీయంగా ప్రచారం చేసే నకిలీ ప్రకటనలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరుతున్నాయని వాటిని నమ్మొద్దని సజ్జనార్ సూచించారు.
వాట్సాప్, ఎస్ఎంఎస్ ద్వారా పంపే ఫేక్ వెబ్సైట్ లింకులు ఓపెన్ చేయొద్దని సూచించారు. ఆన్లైన్లో ముందుగా డబ్బులు చెల్లిస్తే గ్యారెంటీగా గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎవరైనా చెప్పినా నమ్మొదని కోరారు.
ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దు. గ్యాస్ సిలిండర్ బుకింగ్, ఆన్లైన్ చెల్లింపులు అధికారిక గ్యాస్ కంపెనీల వెబ్సైట్లు లేదా అధీకృత ఏజెన్సీల ద్వారా చేయాలని స్పష్టం చేశారు. గుర్తుతెలియని వ్యక్తులకు బ్యాంక్ ఖాతా వివరాలు, OTP, UPI పిన్ ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేసుకోవద్దని సూచించారు.
నకిలీ వెబ్సైట్లలో వివరాలు నమోదు చేస్తే, వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారం సైబర్ నేరగాళ్ల చేతిలో చిక్కి, బ్యాంక్ ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఎవరైనా ఇలాంటి సైబర్ మోసాలకు గురైతే, వెంటనే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ 1930కి కాల్ చేయవచ్చని, లేదా http://cybercrime.gov.in, http://cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు.
Read Also: మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్కు మేధా పాట్కర్ కీలక లేఖ..
Follow Us On: Facebook

