కలం, ఖమ్మం బ్యూరో: “గొంతు ఎండిపోతోంది.. నీళ్లివ్వండి మహాప్రభో” అంటూ భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా పాల్వంచ మండలం కేశవాపురం గ్రామస్తులు ఆదివారం రోడ్డెక్కారు. 13 రోజులుగా గ్రామానికి మంచినీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో ఆగ్రహానికి గురైన స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించారు. మహిళలు, వృద్ధులు, యువకులు సైతం ఖాళీ కుండలతో తరలివచ్చి, రోడ్డుపైనే పడుకుని వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఇటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులు తమ బాధలను పట్టించుకోకపోవడం వల్లే తాము ఈ విధంగా ప్రాణాలకు తెగించి నిరసన తెలపాల్సి వచ్చిందని స్థానికులు మండిపడ్డారు.
గ్రామస్తుల ఆకస్మిక ఆందోళనతో జాతీయ రహదారిపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, సంబంధిత శాఖల అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులతో చర్చలు జరిపిన అధికారులు.. గ్రామంలో తాగునీటి సమస్యను వెంటనే పరిశీలించి, నీటి సరఫరాను పునరుద్ధరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. అధికారుల నుంచి గట్టి భరోసా లభించడంతో గ్రామస్తులు నిరసనను విరమించారు.
అనంతరం పోలీసులు ట్రాఫిక్ను క్రమబద్ధీకరించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. అయితే ఇచ్చిన హామీ ప్రకారం తక్షణమే నీటి సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన మరింత ఉధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.

