కలం, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) ప్లేయర్ల విషయంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది. ఏమైనా తేడా వస్తే ప్లేయర్లను సస్పెండ్ చేయడానికి కావాల్సిన నిబంధనలను పటిష్టం చేసింది. ఏ మాత్రం నిబంధనలను ఉల్లంఘించినా సదరు ప్లేయర్పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనని బీసీసీఐ డిసైడ్ అయింది. ఐపీఎల్ వంటి పెద్ద టోర్నీల్లో ఆటగాళ్లను లక్ష్యంగా చేసుకుని జరిగే ‘హనీ ట్రాప్’ వ్యవహారాలపై బీసీసీఐ కార్యదర్శి దేవాజిత్ సైకియా ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఆటగాళ్లపై లైంగిక వేధింపుల వంటి తీవ్రమైన చట్టపరమైన ఆరోపణలు వచ్చే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ ముప్పును అరికట్టేందుకు ఫ్రాంచైజీలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఏడు పేజీల మార్గదర్శకాలను విడుదల చేశారు.
ఈ నిబంధనలను పర్యవేక్షించేందుకు బీసీసీఐ ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసింది. ఈ టీమ్ సభ్యులు ఎప్పుడైనా ఆటగాళ్ల హోటల్ గదుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారు. టీమ్ మేనేజర్ ముందస్తు అనుమతి లేకుండా ఆటగాళ్లు లేదా అధికారుల గదుల్లోకి బయటి వ్యక్తులు వెళ్లడంపై పూర్తి నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని బోర్డు స్పష్టం చేసింది.
ఆటగాళ్లు వ్యక్తిగత లేదా వినోద కార్యక్రమాల కోసం హోటల్ దాటి బయటకు వెళ్లాల్సి వస్తే, తప్పనిసరిగా సెక్యూరిటీ ఆఫీసర్ లేదా టీమ్ మేనేజర్ నుంచి అనుమతి తీసుకోవాలి. నిబంధనలు పాటించని వారికి షోకాజ్ నోటీసులు, భారీ జరిమానాలు లేదా లీగ్ నుంచి తొలగించే అవకాశాలు ఉన్నాయని బోర్డు హెచ్చరించింది. అలాగే మ్యాచ్ సమయంలో ఫ్రాంచైజీ యజమానులు డగౌట్లో ఉన్న ఆటగాళ్లతో మాట్లాడకూడదని కూడా ఆదేశించింది. క్రికెట్ ప్రతిష్టను కాపాడేందుకు ఫ్రాంచైజీలు, ఆటగాళ్లు ఈ ఆదేశాలను అత్యంత సీరియస్గా తీసుకోవాలని బీసీసీఐ కోరుతోంది.

