కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని మణుగూరు (Manuguru) పట్టణంలో ఉన్న ఇండియన్ గ్యాస్ బ్రాంచ్లో ‘నో స్టాక్’ బోర్డు (No Stock Board) కనిపించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సిలిండర్ల కోసం వచ్చిన వినియోగదారులు ఒక్కసారిగా అయోమయానికి గురి అయ్యారు. ప్రభుత్వం గ్యాస్ కొరత లేదని ప్రకటిస్తుంటే, ఇక్కడ ‘నో స్టాక్’ బోర్డు పెట్టడం ఏమిటని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. యాజమాన్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిజంగా గ్యాస్ లేదా, కావాలని కృత్రిమ కొరత సృష్టిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్న వారిపై అధికారులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ మణుగూరులో ‘నో స్టాక్’ బోర్డు కనిపించడం వినియోగదారుల్లో ఆందోళనను పెంచింది. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే స్పందించి పరిస్థితిని పరిశీలించి వినియోగదారులకు గ్యాస్ సరఫరా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

