కలం, నిజామాబాద్ బ్యూరో: వచ్చే ఏడాది జరుగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన ఏర్పాట్లపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. పుష్కర ఏర్పాట్లపై రాష్ట్ర దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజా రామయ్యర్ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలో (Nizamabad) గోదావరి పరీవాహక ప్రాంతాలైన కందకుర్తి, తాడ్ బిలోలి, కోస్లీ, తుంగిని, బినోల, ఉమ్మెడ, పోచంపాడ్, సావెల్, తడ్ పాకల్, దోంచంద, గుమ్మిర్యాల్ వద్ద పుష్కర ఘాట్లు ఉన్నాయన్నారు. పుష్కరాల కోసం గోదావరి పరీవాహక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి గుర్తించాలన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ తర్వాత కలెక్టర్ జిల్లాధికారులతో సమావేశం నిర్వహించారు. 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు (Godavari Pushkaralu) జరగనున్నాయని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కల్గకుండా పుష్కర ఘాట్లు సిద్ధం చేయాలన్నారు. గత పుష్కరాల్లో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. స్టాళ్లు, తాగునీరు, తాత్కాలిక గదులు, వాహనాల పార్కింగ్, భద్రత, రూట్ మ్యాప్ ఇతర ఏర్పాట్ల వివరాలను పరిశీలించాలన్నారు. ఆయా శాఖల వారీగా సమగ్ర వివరాలతో ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, ఆర్టీసీ ఆర్.ఎం జ్యోత్స్న, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


