కలం, ఖమ్మం బ్యూరో: మైనర్ బాలికపై అత్యాచారం కేసులో దోషికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష పడింది. వివరాలివీ.. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గుంపాడు మండలం లక్ష్మీపురం గ్రామంలో రంగా అనే వ్యక్తి తన తమ్ముడు, మరదలు మరణించడంతో వారి పిల్లల బాధ్యత తీసుకున్నాడు. 2019లో ఓ రోజు మైనర్ బాలిక కనిపించకుండా పోయింది. దీనిపై రంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అప్పటి పాల్వంచ డీఎస్పీ మధుసూదన్ రావు ఆధ్వర్యంలోని పోలీసు బృందం దర్యాప్తు చేసి బాలిక ఆచూకీ కనిపెట్టింది. అనంతరం వైద్య పరీక్షలు చేయగా, మూడు నెలల గర్భవతి అని గుర్తించారు.
విచారణలో సారపాక గాంధీ నగర్కు చెందిన నూనావత్ నవీన్ ఆ అమ్మాయిపై అత్యాచారం చేసినట్లు తేలింది. దీనిపై ఛార్జీషీట్ నమోదుచేసి కోర్టుకు సమర్పించారు (Bhadradri Kothagudem). న్యాయస్థానం 13 మంది సాక్షులను విచారించింది. ఆధారాలు పరిశీలించింది. నవీన్ నేరం చేసినట్లు రుజువు కావడంతో పోక్సో చట్టం కింద 20 ఏళ్ల శిక్ష, రూ.5వేల జరిమానా విధించింది. అలాగే, భారత శిక్షా స్మృతి 336(A) కింద మరో పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ పోక్సో స్పెషల్ సెషన్ జడ్జి ఎస్.సరిత తీర్పు వెలువరించారు. రెండు శిక్షలూ ఏక కాలంలో అనుభవించాలని ఆదేశించారు. ఒక వేళ జరిమానా చెల్లించకపోతే మరో ఆరు నెలలు అదనంగా శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పు వెల్లడించారు.


