కలం, నిజామాబాద్ బ్యూరో: ప్రజావాణి (Prajavani) కార్యక్రమానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi) అధికారులను ఆదేశించారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మొత్తం 146 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను కలెక్టర్ ఇలా త్రిపాఠితో పాటు అదనపు కలెక్టర్లు కిరణ్ కుమార్, భుజంగరావు, డీఆర్ఓ గీత, జిల్లా పరిషత్ సీఈఓ సాయాగౌడ్, నిజామాబాద్ ఏసీపీ ప్రకాశ్లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా సంబంధిత శాఖల అధికారులు నిరంతరం పరిశీలించాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో జాప్యం లేకుండా త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

