కలం, నిజామాబాద్ బ్యూరో: హైదరాబాద్లోని యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో తెలంగాణ తైక్వాండో (Taekwondo) అసోసియేషన్ గ్రాండ్ మాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి తైక్వాండో పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో నిజామాబాద్ (Nizamabad) జిల్లా తైక్వాండో క్రీడాకారులు సత్తా చాటారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన అమేజింగ్ తైక్వాండో అసోసియేషన్కు చెందిన క్రీడాకారులు 15 బంగారు పతకాలు, 6 వెండి పతకాలు, 7 కాంస్య పతకాలు సాధించారు. అమేజింగ్ తైక్వాండో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో వీరంతా శిక్షణ తీసుకుంటున్నారు. ఇన్ని మెడల్స్ సాధించడం పట్ల కోచ్ మనోజ్, తైక్వాండో అసోసియేషన్ హర్షం వ్యక్తం చేశారు. పేరెంట్స్ సైతం తమ పిల్లల ప్రతిభ చూసి మురిసిపోయారు. ఈ కార్యక్రమంలో కోచ్ నాగరాజు క్రీడాకారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

