కలం, నిర్మల్ : భైంసా సబ్డివిజన్ ప్రజలకు పోలీసు సేవలను మరింత చేరువ చేసే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ జానకి షర్మిల(SP Janaki Sharmila) బుధవారం భైంసా (Bhainsa) ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల వినతులను స్వయంగా స్వీకరించి, వాటిని పరిశీలించారు. ఫిర్యాదులపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్లో మాట్లాడి, ప్రతి కేసుపై వేగవంతంగా విచారణ చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు.
అలాగే కుటుంబ వివాదాలకు సంబంధించిన పలు ఫిర్యాదులపై షీ టీం సిబ్బంది ఇరు వర్గాలకు కౌన్సిలింగ్ నిర్వహించి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే ప్రయత్నం చేశారు. గ్రీవెన్స్ డేను నిర్మల్లో కాకుండా భైంసాలోనే నిర్వహించడం వల్ల స్థానిక ప్రజలకు సమయం, ప్రయాణ వ్యయం ఆదా అయిందని, తమ సమస్యలను సులభంగా పోలీసుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం లభించిందని బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు.

