కలం, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ (BRS) అధికారంలోకి రావడం ఖాయమని.. వచ్చిన తరువాత కాంగ్రెస్ నాయకులకు, ఆ పార్టీ కొడుకులకు చుక్కలు చూపిస్తామని ఆ పార్టీ మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆందోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం, పార్టీ సభ్యత్వ నమోదు, SIR ఓటరు జాబితా సవరణ అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఎత్తు, పొడవుల గురించి ఎందుకు?
ఈ సందర్భంగా హరీశ్ రావు (Harish Rao) మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి చేతనైతే సబ్జెక్ట్ పై మాట్లాడాలి తప్ప.. ఎత్తు, పొడవుల గురించి ఆయనకు ఎందుకు? అని ఫైర్ అయ్యారు. పొట్టిగా ఉన్నోడికి పొడుగున్నోడిని చూస్తే ఈర్ష్య పుట్టడం సహజమేనని అన్నారు. ఇటు ఉన్న సూర్యుడు అటు ఉదయించినా, రాష్ట్రంలో మళ్లీ వచ్చేది కేసీఆర్ సర్కారేనని.. భూమి బద్దలైనా మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీనేనని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలకు ఏవి పాలు, ఏవి నీళ్లు అనేది మొత్తం అర్థమైందని అన్నారు. మళ్లీ కేసీఆర్ ప్రభుత్వమే రావాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు.
ఆందోల్ ప్రాంత ప్రజలకు ప్రాణాధారమైన సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఎందుకు బంద్ పెట్టిండో సమాధానం చెప్పాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుల సాధన కోసం బోరంచి అమ్మవారి దగ్గర నుంచి సిద్ధి వినాయక ఆలయం వరకు భారీ పాదయాత్ర చేపడుదామని పిలుపునిచ్చారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే కార్యకర్తలు, నాయకులు పాదయాత్రకు సిద్ధంగా ఉండాలన్నారు.
24 ఏళ్ళ తర్వాత SIR జరుగుతోంది.. జాగ్రత్త!
ఇక సర్ (SIR) అంటే ఏమిటో బీఆర్ఎస్ కార్యకర్తలు తెలుసుకోవాలని హరీశ్ రావు సూచించారు. లేకపోతే ఢిల్లీలో ఉండే బీజేపీ, రాష్ట్రంలో ఉండే ఓటుకు నోటు దొంగతో మన ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు రాష్ట్రాల్లో ఓట్లు తీసేయడం వల్లే ఓటమి చెందారని ఆరోపణలు వచ్చాయని తెలిపారు. “మూడు నెలల క్రితమే జోగిపేటలో ఓటు వేశా.. నా ఓటు ఎక్కడికి పోతుంది అని ఆదమరిచి ఉండొద్దు” అని సూచించారు. 2002లో సర్ ప్రక్రియ జరిగిందని.. మళ్లీ 24 ఏళ్ళ తర్వాత ఇప్పుడు జరుగుతుందని చెప్పారు. ఈ నెల 25వ తేదీ లోపు ఎన్యూమరేషన్ ఫారం నింపి, రెండు కలర్ పాస్ పోర్ట్ ఫోటోలు జతచేసి బీఎల్వోకు ఇస్తేనే ఓటు ఉంటుందని.. ఫారంను ఎట్టి పరిస్థితుల్లో పోగొట్టుకోవద్దని వివరించారు.
Read Also: ఖమ్మంలో ‘ఎల్నినో టాస్క్ఫోర్స్’ ఏర్పాటు చేయాలి: మాజీ మంత్రి పువ్వాడ
Follow Us On: Instagram

