కలం, నిర్మల్ : రసాయనిక ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయాల్సిన అవసరం ఉందని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని తన నివాసంలో బుధవారం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులతో ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖిగా మాట్లాడిన నాయకులు.. సేంద్రియ సాగులో ఎదురవుతున్న సమస్యలు, ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, ప్రభుత్వ ప్రోత్సాహంపై చర్చించారు. సేంద్రియ పద్ధతుల్లో పండించిన పంటలకు దేశవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని, ఈ విధానాన్ని అనుసరించడం ద్వారా రైతుల పెట్టుబడి ఖర్చులు తగ్గి ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం కోసం సేంద్రియ ఉత్పత్తుల వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. రైతుల అనుభవాలను అడిగి తెలుసుకున్న నాయకులు, సేంద్రియ వ్యవసాయ విస్తరణకు అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావుతో పాటు సేంద్రియ వ్యవసాయం చేస్తున్న పలువురు రైతులు పాల్గొన్నారు.

