కేజ్ వీల్స్‌తో రోడ్లపై ట్రాక్టర్లు నడిపితే కేసులు తప్పవు: ఎస్ఐ సంధ్య

కలం, ఖమ్మం బ్యూరో: రోడ్లపై కేజ్ వీల్స్ అమర్చిన ట్రాక్టర్లను నడపడం చట్టరీత్యా నేరమని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఏన్కూరు ఎస్ఐ సంధ్య స్పష్టం చేశారు. ఖమ్మం (Khammam) పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు కేజ్ వీల్స్ అమర్చి రహదారులపై తిరిగే ట్రాక్టర్లను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నట్లు తెలిపారు.

​ఇందులో భాగంగా ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం టి.ఎల్.పేట గ్రామ ప్రధాన రహదారిపై కేజ్ వీల్స్ అమర్చిన ట్రాక్టర్‌ను నడపడం వల్ల రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి టి.ఎల్.పేట గ్రామానికి చెందిన కూచిపూడి నరసింహారావుపై ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించినందుకు గాను సంబంధిత చట్టాల ప్రకారం ఏన్కూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి, ట్రాక్టర్‌ను సీజ్ చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

​ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి గ్రామాలకు మెరుగైన రహదారులను నిర్మిస్తోందని, ఆ ఆస్తులను సురక్షితంగా కాపాడుకోవడం అందరి బాధ్యత అని తెలిపారు. వ్యవసాయ పనుల కోసం కేజ్ వీల్స్ వాడటం సాధారణమే అయినప్పటికీ, పొలాల్లో పనులు పూర్తయిన వెంటనే వాటిని తొలగించి సాధారణ టైర్లు అమర్చుకోవాలని లేదా రోడ్లు దెబ్బతినకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు. ​ట్రాక్టర్ యజమానులు ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తూ, డ్రైవర్లకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కోరారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘిస్తూ రోడ్లను పాడుచేస్తున్నట్లు గమనిస్తే వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>