కలం, నిర్మల్ : జాతీయ లోక్ అదాలత్ (Lok Adalat) ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి సూచించారు. సోమవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన న్యాయస్థానంలో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 20న రెండో జాతీయ మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్మల్, బైంసా, ఖానాపూర్ న్యాయస్థానాల్లో పెండింగ్ లో ఉన్న కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకునేందుకు ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు.
కక్షిదారులు మధ్యవర్తిత్వం ద్వారా తమ వివాదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. లోక్ అదాలత్ లో పలు రకాల సివిల్, క్రిమినల్ కేసులతో పాటు ఇతర వివాదాల పరిష్కారానికి అవకాశం ఉంటుందని తెలిపారు. పెండింగ్ కేసులున్న కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి రాధిక, నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శుభకరన్ తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

