కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని శ్రీ గండి రామన్న క్షేత్రంలో కొలువుదీరిన దత్త సాయి ఆలయ నాలుగవ వార్షికోత్సవాన్ని గురువారం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. సాయి దీక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాల్లో ప్రముఖ వేద పండితుడు గురుమంచి చంద్రశేఖర్ శర్మతో పాటు పలువురు పూజారులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహా గణపతి పూజ, విశేష సంకల్పం, గోపూజ, భగవత్ ప్రార్థన, పుణ్యాహవాచనం తదితర వైదిక కార్యక్రమాలను వేదమంత్రోచ్చారణల నడుమ ఘనంగా నిర్వహించారు.
నిర్మల్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై బాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి, సభ్యులు శంకర్, పండరి, గంగాధర్, నారాయణ, భూమన్న, అజయ్, రాజేష్, గోవర్ధన్, శ్రీనివాస్, హిమజ, సరోజ, కళ్యాణి, నవ్యతో పాటు పలువురు భక్తులు పాల్గొన్నారు.

