కలం, నిర్మల్ : ప్రభుత్వ మాతా, శిశు ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector Bhavesh Mishra) వైద్యాధికారులను ఆదేశించారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మాతా, శిశు ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని విభాగాలను స్వయంగా పరిశీలించిన ఆయన, రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వచ్చే ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఆసుపత్రికి సంబంధించిన రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించారు. ప్రతిరోజూ 24 గంటలూ వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని, ప్రజలకు అవసరమైన వైద్య పరీక్షలు, మందులను ఉచితంగా అందించాలని స్పష్టం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారితో స్వయంగా మాట్లాడి, వైద్యం సరిగ్గా అందుతుందా, వసతులు ఎలా ఉన్నాయనే వివరాలను ఆరా తీశారు.
ప్రజలు ప్రసవాలు, ఇతర చికిత్సల కోసం ప్రభుత్వ ఆసుపత్రులను ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం అందుతుందనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని, అప్పుడే ఆసుపత్రికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందని అధికారులకు వివరించారు. ఆసుపత్రి ప్రాంగణంలో సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చూడాలని, నవజాత శిశువుల సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు. ఈ తనిఖీలో ఆస్పత్రి పర్యవేక్షకులు సరోజ, అధికారులు గోపాల్ సింగ్, రమేశ్, సిబ్బంది పాల్గొన్నారు.

