కలం, వరంగల్ బ్యూరో: తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని ప్రజలకు చేరువ చేయడంతో పాటు యువతలో ఫిట్నెస్పై అవగాహన కల్పించే లక్ష్యంతో ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో నిఖిల్ కుమార్ చేపట్టిన 70 కిలోమీటర్ల ‘హెరిటేజ్ రన్’ విజయవంతంగా ముగిసింది. ములుగు జిల్లాకు చెందిన గిరిజన యువకుడు నిఖిల్ కుమార్ ఎన్ఐటీ కాలికట్ విద్యార్థి. ఎండ్యూరెన్స్ స్పోర్ట్స్లో పాల్గొంటున్న అతడు ఈ రన్ను విజయవంతంగా పూర్తి చేశారు.
గుంజేడు నుంచి మొదలు..
నిఖిల్ కుమార్ శనివారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత గుంజేడు ముసలమ్మ ఆలయం నుంచి పరుగు ప్రారంభించారు. దాదాపు పది గంటల పాటు కొనసాగిన రన్నింగ్ ఆదివారం ఉదయం 10 గంటలకు హనుమకొండలోని ఏకశిలా పార్కు వద్ద ముగిసింది.
గుంజేడు ముసలమ్మ ఆలయం, పాకాల సరస్సు, కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం, వరంగల్ కోట, భద్రకాళి ఆలయం, వెయ్యి స్తంభాల ఆలయం వంటి ప్రముఖ చారిత్రక, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తూ తన పరుగు కొనసాగించారు.
తెలంగాణ వైభవాన్ని పరిచయం చేయాలని..
ఈ సందర్భంగా నిఖిల్ కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ పర్యాటక వైభవాన్ని పరిచయం చేయడమే కాకుండా యువతలో ఫిట్నెస్, ఆరోగ్యకరమైన జీవనశైలిపై చైతన్యం కల్పించాలనే సంకల్పంతో హెరిటేజ్ రన్ నిర్వహించినట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాల ద్వారా తెలంగాణ ప్రత్యేకతను మరింత విస్తృతంగా ప్రచారం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సూర్య కిరణ్, లోకేష్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.

