కలం, వెబ్ డెస్క్ : డిజిటల్ వ్యక్తిగత డేటా రక్షణ చట్టం (DPDP Act) అమలులో జరుగుతున్న ఉల్లంఘనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శికి కమిషన్ ఒక లేఖ రాసింది. ప్రధాన డిజిటల్ ప్లాట్ఫారమ్లలో నిబంధనల అమలు తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తూ, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ముఖ్యంగా చిన్నారుల డేటా బదిలీలను పర్యవేక్షించే వ్యవస్థలు లేకపోవడంపై కమిషన్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. దేశంలోని ప్రముఖ సోషల్ మీడియా, డిజిటల్ సంస్థలు పిల్లల సమాచారాన్ని ఎలా వినియోగిస్తున్నాయనే అంశంపై ఎటువంటి ట్రాకింగ్ యంత్రాంగం లేదని ఎన్ హెచ్ఆర్సీ (NHRC) గుర్తించింది. ఇది పిల్లల గోప్యతకు, వారి ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే అవకాశం ఉందని కమిషన్ హెచ్చరించింది.
దీనితో పాటు వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార యంత్రాంగం కూడా అనేక ప్లాట్ఫారమ్లలో నామమాత్రంగానే ఉందని కమిషన్ పేర్కొంది. డేటా రక్షణ చట్టం ప్రకారం వినియోగదారులకు కల్పించాల్సిన రక్షణ చర్యలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదని తెలిపింది. ఈ ఉల్లంఘనలపై సమగ్ర నివేదిక సమర్పించాలని, చట్టాన్ని పక్కాగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖను కోరింది.

