కలం, వెబ్ డెస్క్: హిమాలయ రాజ్యమైన నేపాల్ (Nepal) రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. బాలెన్ షా నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం కొలువుదీరి పట్టుమని నెల రోజులు కాకముందే.. ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారు. వీరిలో ఒకరు అత్యంత కీలకమైన హోం మంత్రి సుదన్ గురంగ్ (Sudan Gurung). ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఈయన అవినీతి చర్చనీయాంశంగా మారింది. ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టడంతో పాటు మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యాపారవేత్తతో షేర్ల లావాదేవీలు జరిపినట్లు పక్కా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న గురంగ్ వెంటనే రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేయడంతో తప్పుకోవాల్సి వచ్చింది. మరొకరు కార్మిక మంత్రి దీపక్ కుమార్ షా (Dipak Kumar Shah). తన భార్యకు ప్రభుత్వంలో కీలక పదవి ఇప్పించుకునేందుకు ఈయన పావులు కదిపారు. ఆందోళనకారుల ఒత్తిడితో షా సైతం పదవి కోల్పోయారు.
కొత్త ప్రభుత్వానికి గడ్డు కాలమే..
గత ఏడాది జెన్–జీ యువత ఆందోళనల ధాటికి కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం కుప్పకూలింది. అనంతరం, ఎన్నికలు జరగగా యువ నాయకుడు బాలెన్ షా (Balen Shah) ప్రధానిగా ఈ ఏడాది మార్చి 27న బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే అంతా సర్దుకుంటుందన్న తరుణంలో.. ఇద్దరు కీలక మంత్రులు రాజీనామా చేయడం ప్రభుత్వ బలహీనతలను బయటపెట్టింది. ప్రస్తుత పరిణామాలు గమనిస్తే, బాలెన్ షా ప్రభుత్వానికి సవాళ్లు తప్పవని విశ్లేషిస్తున్నారు. మంత్రివర్గంలో చాలా మటుకు అనుభవం లేని వారే ఉండటంతో పాటు ప్రతిపక్షాలు, ఆందోళనకారుల నుంచి నిరంతరం ఒత్తిడి ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో నేపాల్ (Nepal) కొత్త ప్రభుత్వానికి కష్టాలు తప్పేలా లేవని అంచనా వేస్తున్నారు. కాగా, పొరుగు దేశంలో ఈ పరిణామాలను భారత్ జాగ్రత్తగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Read Also: భారత్ పై ట్రంప్ అక్కసు .. ‘నరకం’ అంటూ పోస్ట్
Follow Us On: Sharechat

