కలం, నల్లగొండ బ్యూరో : ఐదారేళ్ళ క్రితం వరకు ఓ వెలుగు వెలిగిన ‘నార్ముల్ మదర్ డెయిరీ’ (నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్) ప్రస్తుతం వెలవెలబోతోంది. మదర్ డెయిరీని (NARMUL Mother Dairy) బంగారు బాతు గుడ్డులా వాడుకుంటూ వచ్చిన లీడర్ల తీరే.. మదర్ డెయిరీ క్లోజ్ అయ్యే పరిస్థితికి రావడానికి కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజానికి మదర్ డెయిరీ ఉమ్మడి నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల పాడిరైతులకు వరప్రదాయినిగా ఉండేది. కానీ ప్రస్తుతం మదర్ డెయిరీ మనుగడ కోసం పోరాడుతోంది. గతంలో రోజుకు 3 లక్షల లీటర్లకు పైగా పాలను సేకరించే డెయిరీ.. నేడు 1 లక్ష లీటర్ల పాలను సేకరించేందుకు ఆపసోపాలు పడుతోంది.
మేనేజ్మెంట్ వైఫల్యాల వల్లే సంక్షోభంలోకి..
మదర్ డెయిరీ(NARMUL Mother Dairy) ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లింది. ఏకంగా రూ.75 కోట్ల అప్పుల్లో చిక్కుకుపోయింది. సంస్థ మేనేజ్మెంట్ వైఫల్యాలకు తోడు మితిమీరిన ఖర్చులే దీనికి ప్రధాన కారణం. ప్రధానంగా 2015లో ఢిల్లీ మదర్ డెయిరీతో ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం సంస్థకు పెద్ద దెబ్బ తగిలింది. పైగా ప్రైవేటు డెయిరీలైన అమూల్, నందిని వంటి పెద్ద సంస్థలు, స్థానిక ప్రైవేట్ డెయిరీల పోటీని తట్టుకోలేక సేకరణ 3 లక్షల లీటర్ల నుంచి లక్ష లోపుకు పడిపోయింది.
భూముల విక్రయానికి నిర్ణయం..
మదర్ డెయిరీ సంస్థకు మొత్తం రూ.75 కోట్లు అప్పు ఉండడంతో సంస్థకు సంబంధించిన భూములను విక్రయించాలని పాలకవర్గం నిర్ణయించింది. మరోవైపు కేవలం ఆస్తులు అమ్మడమే కాకుండా భవిష్యత్తులో సంస్థ మళ్లీ నష్టపోకుండా ఉండటానికి నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్ (NDDB)కు మదర్ డెయిరీ నిర్వహణను ఐదేళ్ల పాటు అప్పగించే అవకాశం ఉంది. జాతీయ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఇప్పటికే మదర్ డెయిరీ ఆస్తులు, అప్పులు మరియు నిర్వహణపై ఒక ప్రాథమిక నివేదికను సిద్ధం చేయగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధిత మంత్రులు ఈ విషయంలో సానుకూలంగా స్పందించారు.
Read Also : లిక్కర్ క్వీన్ TO క్లీన్ క్వీన్ : కవిత పొలిటికల్ గేమ్ చేంజ్
Follow Us On: Instagram

