కలం, వెబ్ డెస్క్: సినిమా హీరోలు డ్రగ్స్కు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు సాయంత్రం లోగా నో టు డ్రగ్స్ వీడియో విడుదల చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) డెడ్ లైన్ విధించారు. ఇది ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. హీరోలే కాకుండా క్రీడాకారులు, రాజకీయ పార్టీల నేతలు, ఇతర రంగాల వారు కూడా స్పందించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి మద్దతు పలకాలన్నారు. డ్రగ్స్ రూపుమాపాలంటే ప్రభుత్వం కట్టపట్టుకుని చేస్తే కాదని, ప్రతి పౌరుడు భాగస్వామి కావాల్సిందేనని స్పష్టం చేశారు.
డ్రగ్స్ తీసుకుంటే సమాచారం ఇవ్వండి..
శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రగ్స్ దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు. భవిష్యత్తు తెలంగాణ కోసం ప్రతి ఏడాది నో టు డ్రగ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. యువతను సన్మార్గంలో నడిపడమే కాకుండా, బాధితులకు సరైన పునరావాసం కల్పించి మరోసారి మహమ్మారి బారిన పడకుండా ఉండటమే ఈ కార్యక్రమం అసలు ఉద్దేశమన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నా, సరఫరా చేస్తున్నట్లు తెలిసినా వెంటనే టోల్ ఫ్రీ నెంబరుకి సమాచారం ఇవ్వాలని కోరారు. అంతేగాకుండా, యువత ఒకచోట కలిసినప్పుడు డ్రగ్స్ మహమ్మారిపై అవగాహన పెంచుకోవాలని చర్చలు చేసుకోవాలని కోరారు.

