కలం, వెబ్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానంగా భారత్, అమెరికా దేశాల మధ్య వివిధ రంగాలలో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారాన్ని వారు సమీక్షించారు. గత కొంతకాలంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు గణనీయమైన పురోగతిని సాధించాయని, భవిష్యత్తులో కూడా సమగ్ర గ్లోబల్ స్ట్రాటజిక్ భాగస్వామ్యాన్ని అన్ని రంగాల్లో మరింత బలోపేతం చేసేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ఇరువురు నేతలు తెలిపారు.
ఈ చర్చల్లో ద్వైపాక్షిక అంశాలతో పాటు అంతర్జాతీయ పరిణామాలపైనా ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై మోదీ, ట్రంప్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచ వాణిజ్యానికి, ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతం ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండాలని, నౌకల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాల్సిన అవసరం ఉందని వారు పేర్కొన్నారు. ఈ వివరాలను ప్రధాని మోదీ స్వయంగా తన ఎక్స్ (X) ఖాతా వేదికగా వెల్లడించారు.

