కలం, మహబూబ్నగర్ బ్యూరో : నారాయణపేట జిల్లా కలెక్టర్గా (Narayanpet Collector) ఉన్న సీ హెచ్ ప్రియాంక(Ch Priyanka) విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ ఉపాధ్యాయురాలిగా మారిన ఘటన ఆసక్తికరంగా మారింది. ఉట్కూర్ (Utkoor) మండలంలోని తిప్రస్పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, పాఠశాల నిర్వహణను పరిశీలించారు. లైబ్రరీ, మధ్యాహ్న భోజనానికి వినియోగించే సరుకులను తనిఖీ చేసి, మెనూ పాటించకపోవడంపై వంట ఏజెన్సీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం 2, 4వ తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థులకు బోర్డుపై లెక్కలు చేసి సులభంగా నేర్పించారు. తరువాత ఉట్కూర్ మండల కేంద్రంలోని పలు పాఠశాలలను సందర్శించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించి, తప్పనిసరిగా మెనూ పాటించాలని ఆదేశించారు. శ్రీరామ్ నగర్ పాఠశాలలో బియ్యంలో పురుగులు ఉన్నట్లు గుర్తించి, వాటిని తిరిగి పంపించి కొత్త బియ్యం తెప్పించాలని హెచ్ఎంను ఆదేశించారు.
ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినులతో మాట్లాడి, ఇంగ్లీష్ పాఠం బోధనను పరిశీలించారు. అర్థం కాని విషయాలను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకోవాలని సూచించారు. అలాగే పదో తరగతిలో 550కు పైగా మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ గది, హిందీ బోధన విధానాన్ని పరిశీలించి విద్యార్థులను ప్రశ్నించారు. పాఠశాలలో మరుగుదొడ్ల వినియోగంపై దృష్టి సారించి, అవసరమైతే కొత్త గదులు, మరుగుదొడ్లు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఉర్దూ మీడియం తరగతుల గదులు శిథిలావస్థలో ఉన్నట్లు గుర్తించి, కొత్త గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఊట్కూర్ తహసిల్దార్ అశోక్ కుమార్, ఎంపీడీవో కిషోర్ కుమార్, ఎంపీవో బాలాజీ, ఉప సర్పంచి, ఆయా పాఠశాలల హెచ్ ఎంలు పాల్గొన్నారు.

