కలం, వెబ్ డెస్క్ : నంద్యాల జిల్లాలో సుమారు పద్నాలుగేళ్ల క్రితం జరిగిన హత్య కేసులో న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. ఆళ్లగడ్డకు చెందిన భూమా నాగిరెడ్డి ప్రధాన అనుచరుడు ఇంజేటి కృష్ణారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యుల హత్యకు సంబంధించి నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ నంద్యాల మూడో అదనపు జిల్లా కోర్టు (Nandyal court) తీర్పునిచ్చింది. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే, 2012వ సంవత్సరంలో ఆళ్లగడ్డలో జరిగిన దాడిలో ఇంజేటి కృష్ణారెడ్డి, మరో ముగ్గురు కుటుంబ సభ్యులు దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటన అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించింది.
పోలీసులు ఈ కేసులో మొత్తం 19 మందిని నిందితులుగా చేర్చి చార్జ్షీట్ దాఖలు చేశారు. అయితే, సుదీర్ఘకాలం పాటు సాగిన ఈ విచారణ ప్రక్రియలో ఏడుగురు నిందితులు వివిధ కారణాలతో మరణించారు. మిగిలిన 12 మంది నిందితులపై నేరం రుజువు కావడంతో, న్యాయమూర్తి వారికి జీవిత కాల కారాగార శిక్షను ఖరారు చేశారు.
తీర్పు వెలువడిన అనంతరం బాధితుల కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇన్నేళ్ల తర్వాత తమకు న్యాయం జరిగిందని, చట్టం తన పని తాను చేసిందని వారు పేర్కొన్నారు. కాగా, శిక్ష పడిన వారి కుటుంబ సభ్యుల రోదనలతో కోర్టు (Nandyal court) ఆవరణలో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Read Also: ‘అందుకే మౌనికను హత్య చేశా’.. నిందితుడి షాకింగ్ కామెంట్స్
Follow Us On : WhatsApp

