కలం, వెబ్ డెస్క్ : ఏపీ ప్రభుత్వ తీరుపై రేపు పాలమూరు ఎమ్మెల్యేలు ‘ఛలో శ్రీశైలం'(Chalo Srisailam) కార్యక్రమానికి పిలుపునిచ్చారు. శ్రీశైలం జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై పాలమూరు (Palamuru) ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం లెఫ్ట్ పవర్ హౌస్ నుంచి విద్యుత్ ఉత్పత్తి నిలిపివేయాలని పలుమార్లు కోరినా, ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కారణంగా శ్రీశైలంలో నీటి మట్టం తగ్గిపోతుండటంతో కల్వకుర్తి ఎత్తిపోతల పథకంపై తీవ్ర ప్రభావం పడుతోంది. దీంతో యాసంగి పంటలకు నీటి కొరత ఏర్పడే పరిస్థితి నెలకొంది.
వారం రోజుల క్రితం డిప్యూటీ సీఎం స్వయంగా ఫోన్ చేసి విషయాన్ని తెలియజేసినా, ఏపీ ప్రభుత్వం తన తీరు మార్చుకోలేదని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో రేపు మంత్రి జూపల్లి కృష్ణారావు(Jupally Krishna Rao) ఆధ్వర్యంలో సుమారు 200 వాహనాల్లో శ్రీశైలం డ్యామ్ వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించనున్నారు. ఈ నిరసన కార్యక్రమంలో (Chalo Srisailam) కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, అచ్చంపేట్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ తదితరులు పాల్గొననున్నారు.
Read Also: మావోయిస్టు గణపతికి మెరుగైన వైద్యం అందిస్తాం : డీజీపీ
Follow Us On : WhatsApp

