కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని షికాగోలో(Chicago Accident) జరిగిన రోడ్డు ప్రమాదంలో నల్గొండ జిల్లా యువతి ప్రాణాలు కోల్పోయింది. నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు గ్రామానికి చెందిన నవ్య అనే విద్యార్థిని ఈ ప్రమాదంలో మృతి చెందింది. నవ్య షికాగోలోని రూజ్వెల్ట్ యూనివర్సిటీలో ఎంఎస్ చదువుతోంది. స్నేహితులతో కలిసి కారులో పార్ట్టైమ్ ఉద్యోగానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వారి వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన మరో కారు బలంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో వెనుక సీటులో కూర్చున్న నవ్యకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు, స్నేహితులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఈ ఘటనపై తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) స్పందించారు. నవ్య మృతి తీవ్రంగా కలిచివేసిందని ఆయన తెలిపారు. ఎం.ఎస్ పూర్తి చేసి ఉన్నత ఆశయాలతో ఉన్న నవ్య అకాల మరణం కుటుంబానికి తీరని లోటు అని పేర్కొన్నారు. నవ్య భౌతికకాయాన్ని త్వరగా స్వగ్రామానికి రప్పించేందుకు రాష్ట్ర ఉన్నతాధికారులతో పాటు అమెరికాలోని తానా, ఆటా ప్రతినిధులతో మాట్లాడి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

