కలం, నల్లగొండ : తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్న లక్ష్యంతో నల్లగొండ (Nalgonda) జిల్లా పోలీస్ శాఖ చేపట్టిన ‘మిషన్ పరివర్తన్’ (Mission Parivartan) కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోంది. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కనగల్ మండలంలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్లగొండ డీఎస్పీ కె. శివరామ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 14న కనగల్ మండలం జి.ఎల్ గార్డెన్ వెనుక భాగంలో గంజాయి పంపిణీ జరుగుతోందన్న సమాచారం అందడంతో పోలీసులు మెరుపు దాడి నిర్వహించారు.
చండూర్ సీఐ టి. రాము పర్యవేక్షణలో కనగల్ ఎస్ఐ కె. రాజీవ్ రెడ్డి తన సిబ్బందితో కలిసి దాడి చేసి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. లక్ష విలువైన 2.2 కిలోల గంజాయి, రెండు కత్తులు, మూడు సెల్ఫోన్లు, గంజాయి రవాణాకు ఉపయోగించిన పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో బొడ్డు చందు, కానుగు సాయిరామ్, జిల్లా చందు, చాడ క్రాంతికుమార్, బొమ్మరగోని అంజి అలియాస్ నిరంజన్ ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది కనగల్ మండలం జి. యాదవెల్లి గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. గత మూడు నెలలుగా హైదరాబాద్ ధూల్పేట్కు చెందిన ఓ మహిళ వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి స్థానికంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. కేసును ఛేదించిన ఎస్ఐ రాజీవ్ రెడ్డి, పోలీసు సిబ్బందిని డీఎస్పీ శివరాం రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

