కలం, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో అక్రమ ఇసుక, చెరువుల మట్టి తవ్వకాలపై కఠినచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ (Nalgonda Collector) చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జిల్లా ఎస్పీతోపాటు ఆర్డీవోలు, తహసీల్దార్లు, డీఎస్పీలు, ఎంపీడీఓలు, ఎస్ఎస్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. జిల్లాలో ఎక్కడైనా పర్మిషన్ లేకుండా ఇసుక తవ్వకాలు నిర్వహిస్తే సంబంధిత వాహనాలను తక్షణమే సీజ్ చేయాలని స్పష్టం చేశారు. చెరువుల నుండి మట్టి తీస్తే కూడా అనుమతి లేకుండా చేస్తే వాహనాలను సీజ్చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రభుత్వ అవసరాల కోసం మట్టి తీసుకోవాలంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని కలెక్టర్ (Nalgonda Collector) సూచించారు. ప్రజలకు అవసరమైన మేరకు ఇసుకను లీగల్గా అందుబాటులో ఉంచాలని కోరారు. కొత్తగా అవసరమైన ప్రాంతాల్లో ఇసుక రీచ్లను ప్రతిపాదనలు సమర్పించాలని తెలిపారు. అనేశ్వరం గుట్ట చెరువు, కనగల్లు తిమ్మన్నగూడెం చెరువుల వద్ద అక్రమ తవ్వకాలపై ప్రత్యేక నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రవాణాతో అందించే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు.
వేములపల్లి మండలం బొమ్మకల్లు, రావులపెంట ప్రాంతాల్లో కొత్తగా రెండు ఇసుక రీచ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. దేవరకొండలో ఇసుక రీచ్ అవసరాన్ని పరిశీలించి ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ.. అక్రమ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని స్పష్టం చేశారు. ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా లేదా మట్టి తవ్వకాలు కనిపిస్తే వెంటనే పోలీసులు కఠినచర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. సంబంధిత వాహనాలను సీజ్ చేసి, నిబంధనల ప్రకారం కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, మైనింగ్ జిల్లా అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.
Read Also: హీరోయిన్ ప్రియాంక చోప్రాకు అరుదైన గౌరవం
Follow Us On : WhatsApp

