కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం వద్ద కుంకీ ఏనుగుల (Kumki Elephants)కు ఘన స్వాగతం పలికారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పంటపొలాలను నాశనం చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న అడవి ఏనుగుల గుంపును కట్టడి చేసేందుకు ఈ కుంకీ ఏనుగులను రంగంలోకి దించుతున్నారు. అందులో భాగంగా పలమనేరు నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు తరలిస్తున్న జయంత్, అభిమన్యు అనే రెండు కుంకీ ఏనుగులు అమరావతిలోని డిప్యూటీ సీఎం కార్యాలయానికి చేరుకున్నాయి.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ ఏనుగులకు స్వయంగా ఆహారాన్ని అందించి ప్రత్యేక స్వాగతం పలికారు. మన్యం ప్రాంతంలో అడవి ఏనుగుల సమస్యను పరిష్కరించి, స్థానిక రైతులకు, ప్రజలకు ఉపశమనం కలిగించేందుకే ఈ కుంకీ ఏనుగులను అక్కడికి పంపిస్తున్నట్లు ఉపముఖ్యమంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.

